About Us |  Contact Us |  Feedback
  Shri Adusumilli V Raja Mouli, IAS, a native of Krishna District, AP is a B.Tech Graduate from Andhra University with specialization in Instrumentation.
He was a topper in Civil Services 2003 examination and was allotted Uttar Pradesh cadre. He worked as Collector for the districts Noida, Jyotiba Phule Nagar, Mau, Hardoi, Bijnor, Budaun & he is presently working as Collector of Ballia District in UP.

Mr. Mouli is known for his Integrity, Honesty & Simplicity. He has outstanding command in Telugu and Sanskrit.

With his articles he has inspired Lakhs of students across the state which are being published in Sakshi Bhavitha education supplement.

If you have any queries related to Civil Services & Personality Development reach him at rajamouli.sakshi@gmail.com.

.:: శీలేనా శోభతే విద్యా... ::.

మీ పిల్లవాడు ఎందుకూ పనికిరాడు అని స్కూల్లోనుంచి తీసుకెళ్ళిపొమ్మని ఉపాధ్యాయురాలు రాసిన ఒక చిన్న చీటీ ఆ పిల్లవాడి తల్లిని వ్యధకు గురిచేసి, తన పిల్లవాడిని ప్రపంచానికి పనికి వచ్చే ఎన్నో ఆవిష్కరణలు చేసేలా మార్చిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆ పిల్లవాడు మరెవరోకాదు ‘థామస్ ఆల్వా ఎడిసన్’.

ప్రపంచానికి మన బంధుత్వం ఏమిటో తెలియచెప్పేదే విద్య అన్నారు. పరీక్షలు, కోచింగులు అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లవాడ్ని తరమటంలోనే తల్లిదండ్రులందరూ పోటీ పడుతున్నారు.. కానీ జీవితానికి అవసరమైన ‘నడక’ నేర్పడంలో సఫలం కాలేకపోతున్నారు. ఒక పిల్లవాని విద్య అతను పుట్టడానికి వందేళ్ల ముందు ప్రారంభం అవ్వాలని అంటారు ఓ రచయిత. అంటే పిల్లవాని విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఏమిటో చెప్పకనే చెపుతుంది ఈ వాక్యం. ఇక్కడ విద్య అంటే పుస్తకాల్లోను, స్కూళ్లలో నేర్చుకున్న విద్య కాదు, తరతరాలుగా మానవ జాతికి అందిస్తున్న మానవీయ విలువల సమాహారం. తల్లిదండ్రులు సన్మార్గాన్ని ఆచరిస్తూ పిల్లల్ని అలానే పెంచితే సంఘానికి మేలు చేసినట్లే. తల్లిదండ్రుల అలవాట్లు, ఆచార వ్యవహారాలు, గృహవాతావరణం పిల్లల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.
 
‘‘స్పర్థయా వర్ధతే విద్యా’’ అన్నారు. అంటే పోటీ వలన విద్య రాణిస్తుంది అని అర్థం. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా, ఈర్ష్య, అసూయ లేకుండా తన శక్తిని తాను వృద్ధి చేసుకొనే విధంగా ఉండాలని అర్థం. ఈ రకమైన మానసిక వాతావరణంతో పిల్లవాడ్ని తన కోసం, సంఘం కోసం ఉపయోగపడే విధంగా ముందుకు నడిపించగలుగుతున్నామా లేదా అని తల్లిదండ్రులు వేసుకోవలసిన ప్రశ్న. రామాయణంలో ఒక చోట ‘పరమళభరిత పుష్పం, పండిన ఫలం, అందమైన స్త్రీ’ని చూసినప్పుడు ఎవరి మనసు చెలించదు అని లక్ష్మణుడు రాముడిని ప్రశ్నించినప్పుడు ‘‘సదాచార సంపన్నుడైన తండ్రి, సద్గుణవతి అయిన తల్లి’’ కలిగిన పుత్రుని మనసు చెలించదు అని రాముడు సమాధానం ఇస్తాడు. పిల్లల శీలంపై తల్లిదండ్రుల ప్రభావానికి ఇది నిదర్శనం. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు - తల్లిదండ్రులు నియంతల్లా వ్యవహరించకుండా, స్నేహితుల్లా మెలగాలి. ఉపనిషత్తుల్లో పేర్కొన్నట్లుగా ‘‘సర్వం ఆత్మవశం సుఖం, సర్వం పరవశం దుఃఖం.’’ స్వావలంబన సుఖం.. పరాన్న జీవిగా ఉండటం దుఃఖం అని దీని అర్థం.

విద్యాభ్యాసం దీపం వెలిగించినట్లుగా ఉండాలి కానీ, మూసలో పోసిన సమాచారం కాకూడదు. ఒకసారి ప్రాథమిక దశలో ఉన్న ఒక విద్యార్థిని నీకు టి.వి. ఇష్టమా, రేడియో ఇష్టమా అని అడగగా అతను రేడియో అని బదులు చెప్పాడు. కారణం అడిగితే దృశ్యాలు రేడియో ద్వారా మెరుగుగా కనిపిస్తాయన్నాడంట. దీన్ని విశ్లేషిస్తే టి.వి. లో వారు చూపించేదే చూడాలి అదే రేడియో అయితే విని తన మనసుకు నచ్చినట్లుగా తన ఊహాశక్తిని మలచుకోవచ్చు అన్నాడు. దీని అర్థం, నేర్చుకున్న విద్య ఊహాశక్తిని పెంచి ఆలోచింపచేసేలా ఉండాలి కానీ, అంగీకరించి ఆగిపోయేలా ఉండకూడదు. అదే ఈ కాలంలో అయితే పిల్లవాడి తల్లి స్కూలు మార్చేదేమో. టి.వి. సీరియల్స్‌తో విరామం దొరకక పిల్లలను స్కూళ్లకి ట్యూషన్స్‌కి పరిగెత్తించే తల్లిదండ్రులందరికీ ఇది కనువిప్పు కాదా.

చదువు, జ్ఞానం మనుషులను బలవంతుల్ని, ధనవంతుల్ని చేస్తుంది. డబ్బు కాదు. పఠనం మనిషిని పరిపూర్ణుడ్ని చేస్తుందంటాడు బేకన్. జీవితంలో తన తప్పు ఒప్పుల నుంచే నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటే మనుగడ కష్టం. మహనీయుల జీవిత చరిత్రలని చదవటం ద్వారా వారి జీవితానుభవాల సారం మనం గ్రహించి భావి జీవిత దిశా నిర్దేశానికి ఎంతో దోహదం చేస్తుంది. ఉదాహరణకు పోటీ పరీక్షల్లో ర్యాంకులు రానివారూ, ఆశించని ఫలితం పొందని వారూ, ఆత్మహత్యల వైపు ఆలోచించే వారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడి జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేయనందుకు బాధపడుతున్నాడేమోనని మిత్రుడు సముదాయించబోతే కెనడి ఎంతో గంభీరంగా...వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడంట. ఇలా ఓటమి ఎదురైనప్పుడు ఆహ్వానించి, గెలుపుని ఆస్వాదించే క్షణం కోసం పరితపించటం తోనే గెలుపు సాధ్యం కానీ నిరాశ నిస్పృహలతో కాదు అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి. మంచి పుస్తకమే మంచి స్నేహితుడు.

‘విద్యాతురాణాం నసుఖం, ననిద్ర’ విదార్థికి సుఖం, నిద్ర ఉండకూడదు. ఈ రెండింటికి అలవాటు పడ్డ వారు విద్యార్థిగా రాణించలేరు. విజయాన్ని సాధించ లేరు. లక్ష్యం కోసం తపస్సు చేయాలంటారు. తపస్సు అంటే తపించటమే. పగలంతా క్రికెట్ మ్యాచ్ చూసి రాత్రి ఆ మ్యాచ్ ఫలితంపై తపిస్తూ ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేక, సాధించిన వారిని చూసి అదృష్టం వరించిందని తాము దురదృష్ట వంతులమని అనుకోవడం ఆత్మవంచనే అవుతుంది. వైఫల్యాన్ని కొత్త ప్రేరణకు పునాదిగా చేసుకొని బద్ధకం మనిషికి బద్ద శత్రువనే విషయూన్ని గ్రహించి కఠోర పరిశ్రమ చేస్తే దురదృష్టవంతుణ్ణి అనుకున్నవాడే అదృష్టవంతుడవుతాడు.

మనిషి వ్యక్తిత్వాన్ని కష్టకాలమే నిర్ణయిస్తుంది. చదివిందంతా మరచిపోగా వ్యక్తిలో మిగిలినవే విద్యకు అసలైన ఆనవాళ్లు; ఆ ఆనవాళ్లే విలువలు.‘‘జ్ఞానం సముద్రంలాంటిది. అందులో ముత్యాల రాసులు కోకొల్లలు, వాటిని తేగలిగే ప్రతిభావంతులు ఉంటే ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఆ సముద్రం ఒడ్డున గులకరాళ్లను ఏరే పసివాడిని’’ అన్న న్యూటన్ మాటలు విద్యార్థుల్లో ఉండవలసిన అణకువకు నిదర్శనం.
Related Topics..
Home | About Us | Disclaimer | Contact us at education@sakshi.com
Engineering | Competitive Exams | Tenth Class | Intermediate
Copyright © 2010 sakshieducation.com. All rights reserved.
Site is Best viewed in Internet Explorer 7 & above with 1024 × 768 Resolution
Receive All Updates Via Facebook