సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర 24 కేంద్ర సర్వీసుల్లో.. పోస్ట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష! మూడంచెల ఎంపిక ప్రక్రియలో..తొలి దశ ప్రిలిమ్స్ పరీక్షకు లక్షల మంది పోటీ పడుతుంటారు.
వీరిలో ఏళ్ల తరబడి ప్రిపరేషన్ సాగించే వారితోపాటు అప్పటికే ఇతర సర్వీసుల్లో చేరి.. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి రాసే సీనియర్ల సంఖ్య వేలల్లో ఉంటుంది.! ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడే డిగ్రీ పూర్తిచేసుకొని బయటకు వచ్చిన ఫ్రెషర్స్.. తొలి ప్రయత్నంలో... సివిల్స్ సాధించడం సాధ్యమేనా అనే సందేహం ఎదురవుతుంది! కొద్దిపాటి మెళకువలు, వ్యూహాత్మక ప్రణాళికతో అడుగులు వేస్తే.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించొచ్చు అంటున్నారు గత టాపర్స్!! ఫిబ్రవరి 10న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2021 నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ...
తొలిసారిగా రాసే అభ్యర్థుల్లో...
దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు హాజరయ్యే పరీక్ష సివిల్స్. దీని సన్నద్ధత, విజయంపై తొలిసారిగా రాసే అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంటుంది. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ సాగిస్తేనే సక్సెస్ లభిస్తుందనే అభిప్రాయం నెలకొనడమే ఇందుకు కారణం. దీంతో..సబ్జెక్ట్ నైపుణ్యం, సామాజిక అవగాహన ఉన్నప్పటికీ.. డిగ్రీ పూర్తవుతూనే పరీక్షకు హాజరయ్యే ఫ్రెషర్స్ సంఖ్య కొంత తక్కువగా ఉంటోంది. సివిల్స్ పరీక్ష తీరుతెన్నులు, సిలబస్, దానికి అనుగుణంగా ప్రణాళికతో వ్యవహరిస్తే తొలి ప్రయత్నంలోనూ విజయం సాధించొచ్చంటున్నారు సబ్జెక్ట్ నిపుణులు, గత టాపర్లు.
ఇదే విజయానికి తొలి ఆయుధం.. :
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. ఇదే విజయానికి తొలి ఆయుధం. ‘ఏళ్ల తరబడి కష్టపడాలి’, ‘గంటలకొద్దీ నిద్రాహారాలు మాని చదవాలి’, ఇలాంటి మాటలు వినిపించినా... వాటిని పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. వాస్తవానికి సివిల్స్ విజేతల గణాంకాలను పరిశీలిస్తే.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన వారి సంఖ్య 15 నుంచి 20 శాతం మధ్యలోనే ఉంటోంది. లక్షల మంది పోటీ పడే పరీక్షలో ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఆ శ్రేణిలో తాము కూడా నిలవగలం అనే ఆత్మవిశ్వాసం, ఉత్సుకత ఉంటే.. సక్సెస్ దిశగా సగం గమ్యం చేరుకున్నట్లే!
కనీసం ఏడాది ముందు నుంచి..
సివిల్స్ టాపర్స్, సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం-సివిల్స్ను తొలి ప్రయత్నం లోనే సాధించాలంటే.. పరీక్ష తేదీకి కనీసం ఏడాది ముందుగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. సివిల్స్- 2021 తొలి దశ పరీక్ష ప్రిలిమ్స్ జూన్ 27న జరగనుంది. అంటే.. ఇప్పటి నుంచి అందుబాటులో ఉండే సమయం ఆరున్నర నెలలు. ఆ తర్వాత రెండో దశ పరీక్ష.. మెయిన్ ఎగ్జామినేషన్.. సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది. అంటే.. ప్రిలిమ్స్ తర్వాత రెండున్నర నెలల సమయం లభిస్తుంది. మొత్తంగా ఇప్పటి నుంచి చూస్తే.. స్థూలంగా అందుబాటులో ఉన్న సమయం తొమ్మిది నెలలు. ఈ సమయాన్ని నిర్దిష్ట ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంది.
విజయానికి తొలి మెట్టు..
సివిల్స్ తొలి ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులైనా.. మరోసారి ప్రయత్నిస్తున్న వారైనా ప్రధానంగా రెండు అంశాలపై పట్టు సాధించాలి. అవి.. సివిల్స్ సిలబస్పై పూర్తి అవగాహన పెంచుకోవడం.. రెండోది, పరీక్ష విధానం, తీరుతెన్నులు సమగ్రంగా తెలుసుకోవడం. అభ్యర్థులు ముం దుగా సిలబస్ను క్షుణ్నంగా పరిశీలించాలి. ఆ తర్వాత పరీక్ష విధానం, దానికి అనుగుణంగా గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. అడుగుతున్న ప్రశ్నల తీరుపై అవగాహన వస్తుంది. దానికి అనుగుణంగా సిలబస్లో ఏఏ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలో అర్థం అవుతుంది.
ఆప్షనల్ సబ్జెక్ట్పై స్పష్టత ఉండాలిలా.. :
తొలి ప్రయత్నంలో విజయం సాధించాలనుకునే అభ్యర్థులు..మెయిన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికపై సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయానికి రావాలి. అందుబాటులో ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్లు.. వాటిలో తమకు అనుకూలమైనవి.. ఆయా సబ్జెక్ట్లకు సంబంధించి పరీక్షలో సిలబస్.. స్కోరింగ్ అవకాశాలు.. అన్నింటిపైనా సమాచారాన్ని సేకరించు కోవాలి. ఇటీవల ఫలితాలను విశ్లేషిస్తే.. ఇంజనీరింగ్, టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మొదలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థుల వరకూ..అధిక శాతం మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, లిటరేచర్, సోషియాలజీ తదితర సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. దీనికి కారణం ఆయా సిలబస్ అంశాలను సులువుగా అర్థం చేసుకునే వెసులుబాటుతోపాటు ప్రిపరేషన్ పరంగా మెటీరియల్ అందుబాటులో ఉండటమే.
పటిష్ట ప్రణాళికతోనే...
పరీక్ష విధానం, సిలబస్, ఆప్షనల్స్.. ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చిన అభ్యర్థులు.. ఏమాత్రం జాప్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రారం భించాలి. తొలిరోజు నుంచే పకడ్బందీ ప్రణాళికతో చదవాలి. అందుకోసం టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. ప్రతిరోజు కనీసం 8 నుంచి పది గంటలు చదువుకోసం కేటాయించాలి. ఈ నిర్దిష్ట టైమ్లోనే అన్ని సబ్జెక్ట్లను సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
{పిలిమ్స్, మెయిన్.. సమ్మిళితంగా..
తొలి అటెంప్ట్లోనే సక్సెస్ సాధించాలనుకునే అభ్యర్థులు.. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఉమ్మడి అంశాలను సమ్మిళితంగా ఒకే సమయంలో చదివే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్లో.. జనరల్ స్టడీస్ పేపర్లకు ఒకే సమయంలో సన్నద్ధత పొందే అవకాశం ఉంది. దీనికి చేయాల్సిందల్లా ఆయా సబ్జెక్ట్లను డిస్క్రిప్టివ్ దృక్పథంతో అభ్యసించడమే. ప్రిలిమ్స్కు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్పైనే దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్ ముగిసిన రోజు నుంచి మెయిన్ కోసం జీఎస్, ఆప్షనల్ సబ్జెక్ట్పై ఫోకస్ చేయాలి. పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఆప్షనల్స్ను ఎంచుకుంటే.. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే సదరు ఆప్షనల్స్పైనా పట్టు లభిస్తుంది.
శిక్షణ తీసుకోవాలా? వద్దా..?
సివిల్స్ అభ్యర్థుల మదిలో మెదిలే మరో ప్రధాన సందేహం.. శిక్షణ తీసుకోవాలా? వద్దా? అనేది! వాస్తవానికి శిక్షణ అనేది గెడైన్స్ టూల్ మాత్రమేనని.. అది అభ్యర్థులు సరైన మార్గంలో పయనించేలా చేయడానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. విజయాన్ని శాసించేది మాత్రం అభ్యర్థిలోని నిజమైన సామర్థ్యమేనని పేర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణ విషయంలో అభ్యర్థులు తగు నిర్ణయం తీసుకోవాలి.
మెటీరియల్ మెళకువలు ఇలా..
కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా విజయంలో మెటీరియల్ కీలక పాత్ర పోషిస్తుంది. అభ్యర్థులు ఆయా పేపర్లు/సబ్జెక్ట్లకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ను సేకరించుకోవాలి. ఒక్కో సబ్జెక్ట్కు కనీసం రెండు పుస్తకాలు చదవాలి. నాలుగైదు పుస్తకాలు చదివితేనే విజయం సాధ్యం అనే భావన సరికాదు. సిలబస్ పరంగా అన్ని అంశాలున్న ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలు పదే పదే చదవడం ద్వారా పట్టు సాధించొచ్చు.
నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్..
{పిపరేషన్లో భాగంగా ముందుగా ముఖ్యమైన, క్లిష్టమైన అంశాల జాబితా రూపొందించుకోవాలి. తొలుత క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించేలా కృషి చేయాలి. సులభంగా ఉండే అంశాల కోసం కూడా కొంత సమయం వెచ్చించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. క్లిష్టమైన, ముఖ్యమైన అంశాల కోసం కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. అదేసమయంలో ఇతర సబ్జెక్ట్లను విస్మరించి వీటి కోసమే పూర్తి సమయం కేటాయించడం సరికాదు.
సబ్జెక్ట్ల సమన్వయంతో...
- సివిల్స్ విజయం సాధించేందుకు సబ్జెక్ట్లు (పేపర్లు)ను సమన్వయం చేసుకుంటూ అభ్యసించడం చాలా అవసరం. ప్రస్తుతం సిలబస్ను పరిగణనలోకి తీసుకుంటే.. జాగ్రఫీ-ఎకానమీ, పాలిటీ-ఎకానమీ, కరెంట్ అఫైర్స్-ఎకానమీ,పాలిటీ సబ్జెక్ట్ల పరంగా పలు అంశాలను సమన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఇలా చేయడం వల్ల ఒకే సమయంలో రెండు పేపర్లకు సంసిద్ధత లభిస్తుంది. ప్రధానంగా తొలిప్రయత్నంలో నెగ్గాలనుకునే వారికి ఈ తరహా ప్రిపరేషన్ ఎంతో కలిసొస్తుంది.
- సివిల్స్ రాసే అభ్యర్థులకు సమకాలీన అంశాలపై విస్తృతమైన అవగాహన ఉండాలి. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ను నిరంతరం ఫాలో కావాలి. చదివేటప్పుడే సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్కు బాగా ఉపయోగపడుతుంది.
బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ :
- మోడ్రన్ ఇండియన్ హిస్టరీ- బిపిన్ చంద్ర
- ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్-బిపిన్ చంద్ర
- ఇండియా కల్చర్-స్పెక్ట్రమ్
- ఇండియన్ జాగ్రఫీ -మాజిద్ హుస్సేన్
- ఇండియన్ పాలిటీ-లక్ష్మీ కాంత్
- ఇండియన్ ఎకానమీ- రమేశ్ సింగ్
- ఇండియా ఇయర్ బుక్
- ఎకనామిక్ సర్వే
- అనలిటికల్ రీజనింగ్- ఎం.కె.పాండే
- వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్
సివిల్స్ తొలి విజేతలు..గత గణాంకాలు ఇలా..:
- సివిల్స్-2018లో మొత్తం 759 మంది విజేతల్లో 84 మంది తొలి ప్రయత్నంలో విజయం సాధించారు.
- సివిల్స్-2017లో మొత్తం ఎంపికైన అభ్యర్థులు 1056 కాగా 76 మంది తొలి ప్రయత్నంలో విజేతల జాబితాలో నిలిచారు.
- సివిల్స్-2016లో మొత్తం విజేతలు 1209 మంది ఉండగా.. మొదటిసారే విజయం సాధించిన వారి సంఖ్య 121.
- సివిల్స్-2015లో తుది విజేతలు 1164 మంది కాగా తొలి ప్రయత్నంలో విజయం సాధించిన వారు 85 మంది.
సరిపడ సమయం :
సివిల్స్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాలనుకుంటున్న అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలి. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించినా ప్రిలిమ్స్లో విజయం సాధించే అవకాశముంది. చదవాల్సిన ముఖ్యమైన అంశాలు, చదవాల్సిన తీరుపై విశ్లేషణాత్మకంగా వ్యవహరించాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు.. తమకు పట్టున్న, ఆసక్తి ఉన్న అంశాలను ఆప్షనల్గా ఎంపిక చేసుకోవాలి.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
పట్టుదలతో కృషి చేస్తే సాధ్యమే..
సివిల్ సర్వీసెస్ ఎంపికలో తొలి ప్రయత్నంలో విజయం సాధించడంపై అపోహలు అవసరంలేదు. పట్టుదలతో కృషి చేస్తే సక్సెస్ సాధ్యమే. దీర్ఘకాలిక ప్రణాళిక, నిర్దిష్ట వ్యూహం, ప్రిపరేషన్ సాగించే విషయంలో స్పష్టతతో అడుగులు వేయాలి. కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అనేది అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. డిగ్రీ చదివేటప్పటి నుంచే సివిల్స్ సాధించాలనే పట్టుదలతో కృషి చేశాను. ఫలితంగా తొలి యత్నంలోనే విజయం సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను.
- ఐశ్వర్య షిరాన్ (ఐఎఫ్ఎస్ ట్రైనీ), 93వ ర్యాంకు (సివిల్స్-2019)
సివిల్స్ ప్రిలిమ్స్-2021 షెడ్యూల్ ఇలా.. :
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి10, 2021
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 2, 2021
{పిలిమ్స్-2021 పరీక్ష తేదీ: జూన్ 27, 2021
మెయిన్ పరీక్షలు: సెప్టెంబర్ 17, 2021 నుంచి